Bandi Sanjay మరో కీలక నిర్ణయం.. నడ్డాతో బిగ్ ప్లాన్!

by Disha Web Desk 2 |
Bandi Sanjay మరో కీలక నిర్ణయం.. నడ్డాతో బిగ్ ప్లాన్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు రచించాల్సిన వ్యూహాలపై కమలనాథులు ఫోకస్ పెడుతున్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తే అధికారం సునాయాసమని వారు భావిస్తున్నారు. ఇప్పటికే సర్వేల్లో కూడా 78 సీట్లలో విజయం తమదేనని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్ బాంబు పేల్చారు. అభ్యర్థుల ప్రకటన కూడా చేయకముందే పరిస్థితి ఇలా ఉంటే అనౌన్స్ చేస్తే కనీసం 90 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తంచేశారు. ఇదిలా ఉండగా దీన్ని సుసాధ్యం చేసేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రంగంలోకి దిగబోతున్నారు. నియోజకవర్గాల్లో పర్యటనలకు సిద్ధమవుతున్నారు. ఒక్క రోజే కనీసం 3 నియోజకవర్గాల్లో టూర్ వేయాలని డిసైడ్ అయ్యారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి రావడమే ధ్యేయంగా పెట్టుకున్నారు.

గ్రౌండ్ లెవల్‌లో పార్టీ బలంగా ఉంటే అధికారం తథ్యమని భావిస్తున్న కాషాయ పార్టీ బూత్ లెవల్ నుంచి మరింత స్ట్రెంథెన్ చేయాలని భావిస్తోంది. అందులో భాగంగా వారిలో జోష్ నింపేందుకు వచ్చేనెల 7వ తేదీన నడ్డా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బూత్ సభ్యులతో వర్చువల్ మీట్‌లో పాల్గొననున్నారు. తెలంగాణలో మొత్తం 35,700 బూత్‌లు ఉన్నాయి. ఒక్కో నియోజకవర్గంలో కనీసం 300 బూత్‌లు ఉంటాయి. ఒక్కో బూత్ లో 20 మంది చొప్పున చూసుకున్నా మొత్తం 7,14,000 మందితో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వర్చువల్‌గా సమావేశం నిర్వహించనున్నారు. ఒకేసారి అన్ని బూత్ కమిటీలతో సమావేశం కానుండటంతో రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. భవిష్యత్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై జేపీ నడ్డా వారికి దిశానిర్దేశం చేయనున్నారు.

సంస్థాగత బలోపేతంపై బీజేపీ దృష్టిసారించడంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రంగంలోకి దిగనున్నారు. సంక్రాంతి తర్వాత నియోజకవర్గాల్లో వరుస టూర్లకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది జనవరి 15 నుంచి 30వ తేదీ వరకు నియోజకవర్గల వారిగా సమీక్షలు నిర్వహించనున్నారు. ఒక్కోరోజు మూడు నియోజకవర్గాల్లో సంజయ్ పర్యటనలు చేసేలా కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో స్వయంగా అధ్యక్షుడే రంగంలోకి దిగి పరిస్థితులు చక్కదిద్దే పనిలో పడ్డాడు. ఈ టూర్లలో పార్టీ బలోపేతంతో పాటు కమిటీల ఏర్పాటుపై సంజయ్ దృష్టిసారించనున్నారు. ఎన్నికల సందర్భంగా నేతలు వ్యహరించాల్సిన తీరుపై సంజయ్ అవగాహన కల్పించనున్నారు. అంతేకాకుండా ఈనెల 19 నుంచి 21వ తేదీ వరకు వీలును బట్టి రాష్ట్రంలోని అన్ని జిల్లాల పరిధిలో జిల్లా పదాధికారుల సమావేశాలు నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం దిశానిర్దేశం చేసింది. రైతు రుణమాఫీ, ధరణి పోర్టల్ లోపాలు, రైతు సమస్యలపై ఈనెల 27న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు.

హాట్ హాట్‌గా పదాధికారుల సమావేశం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడుతను పూర్తి చేసుకున్న మరుసటి రోజే రాష్ట్ర పదాధికారులు, జిల్లా, నియోజకవర్గాల ఇన్ చార్జీలతో అత్యవసరంగా భేటీ నిర్వహించారు. ఇందులో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశం హాట్ హాట్‌గా జరిగింది. తొలుత రాష్ట్ర కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్ చార్జీలతో సమావేశమయ్యారు. మొత్తం 8 అంశాలపై ఈ సమావేశం జరిగింది. జనానికి చేరువయ్యేందుకు తీసుకోవాల్సిన నిర్ణయాలు, సంస్థాగత బలోపేతం, జీ 20 సదస్సులో అగ్ర దేశాలకు అధ్యక్షత వహించడం, ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్, మన్ కీ బాత్, ప్రజా సంగ్రామ యాత్రలో ప్రజల నుంచి వచ్చిన స్పందన, సోషల్ మీడియా, అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాల ఏర్పాటు గురించి ప్రధానంగా చర్చ జరిగింది. జీ 20 సదస్సుకు అగ్రదేశాలకు అధ్యక్షత వహించడం, జీ 20 లోగో ఆవిష్కరించింది సిరిసిల్లకు చెందిన వ్యక్తి హరిప్రసాద్ కావడం గర్వకారణమని నేతలు పేర్కొన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ప్రజల్లో పరివర్తన వస్తోందని సభ్యులంతా బండి సంజయ్‌కి ఏకగ్రీవంగా అభినందన తీర్మానం ప్రవేశపెట్టారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా వచ్చే ఏడాది డిసెంబర్ లోపు అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం పూర్తికావాలని నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా ద్వారా అన్ని గ్రామాల్లో బూత్‌ల వారీగా గ్రూపులు ఏర్పాటు చేసి ప్రజలకు చేరువకావడంపై దృష్టిసారించాలని దిశానిర్దేశం చేశారు.

జిల్లా అధ్యక్షుల గైర్హాజర్‌పై 'చుగ్' ఫైర్

పదాధికారుల సమావేశానికి హాజరుకాని ఐదుగురు జిల్లా అధ్యక్షులపై బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి తరుణ్ చుగ్ ఫైరయ్యారు. భువనగిరి జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్ రావు, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు సోమవరపు సత్యనారాయణ, నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు సుధాకర్, మరో రెండు జిల్లాల నుంచి ఇద్దరు అధ్యక్షులు రాకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని రాష్ట్ర కమిటీకి తరుణ్ చుగ్ ఆదేశించారు. అంతేకాకుండా జిల్లాల్లో పార్టీ బలోపేతంపై దృష్టిసారించని వారికి వార్నింగ్ ఇచ్చారు. ఫర్ఫామెన్స్ రిపోర్ట్ సరిగ్గా లేని జిల్లా అధ్యక్షులపై ఆయన సీరియస్ అయ్యారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బీజేపీ రాష్ట్ర సహ ఇన్ చార్జి అరవింద్ మీనన్, జాతీయ కార్యవర్గ సభ్యులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, నల్లు ఇంద్రసేనా రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ప్రేమేందర్ రెడ్డి, బంగారు శృతి, దుగ్యాల ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Also Read...

సార్.. ఎక్కడికెళ్లినా ఇదే అడుగుతున్నారు... ఏం జేయమంటర్ సార్?

Next Story

Most Viewed